ముంబై, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): బద్ధ శత్రువులైన బీజేపీ-కాంగ్రెస్లు మహారాష్ట్రలోని మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం కోసం తమ సిద్ధాంతాలను పకనపెట్టి చేతులు కలిపాయి. మాలేగావ్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు. ఈ సారి మేయర్ పదవి జనరల్ క్యాటగిరీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్కు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు కలిసి భారత్ వికాస్ అఘాడి అనే కొత్త కూటమిని ఏర్పాటు చేశారు.
ఈ కొత్త గ్రూపునకు కాంగ్రెస్ నేత ఎజాజ్ బేగ్ నాయకత్వం వహిస్తున్నారు. వీరు తమ గ్రూపును అధికారికంగా నమోదు కూడా చేసుకున్నారు.ఇటీవల జరిగిన మాలేగావ్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇస్లాం పార్టీ 35 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఏఐఎంఐఎం 21, శివసేన (షిండే వర్గం) 18 స్థానాలు , సమాజ్ వాదీ పార్టీ 5 స్థానాలు, కాంగ్రెస్ 3, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో శివసేనను అధికారం నుంచి దూరంగా ఉంచడానికి ఇస్లాం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు బీజేపీ-కాంగ్రెస్ జతకట్టాయి.