జైపూర్ : కొవిడ్-19 కట్టడిలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాజస్థాన్ లో పాలక కాంగ్రెస్ సర్కార్ కరోనా మరణాలను దాచుతూ నకిలీ సమాచారం అందిస్తోందని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ మంగళవారం ఆరోపించారు. యాభై రోజుల్లో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కరోనా బారినపడి 3918 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోందని అయితే రాజస్థాన్ లోని 512 బ్లాక్ ల్లో 14,482 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు గెహ్లోత్ సర్కార్ వ్యాక్సిన్లను వ్యర్ధం చేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పించింది. వ్యాక్సిన్లు తగినంతగా రాష్ట్రంలో అందుబాటులో ఉండగా డోసులను ప్రజలకు సరిగ్గా అందించడంలో విఫలమయ్యారని, మొత్తం ప్రక్రియను గెహ్లోత్ సర్కార్ సమర్ధంగా నిర్వహించలేదని రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా ఆరోపించారు. ఇక గడిచిన 24 గంటల్లో రాజస్థాన్ లో 4414 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, మహమ్మారితో 103 మంది ప్రాణాలు విడిచారు.