బీజేపీ మద్దతుదారు కంపెనీకి!
దుబాయ్లోని ట్రావ్ఈజీకి బాధ్యతలు
సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ప్రకాశ్
కర్ణాటక సీఎం బొమ్మైకి సలహాదారు
రియాద్, జూన్ 20: హజ్ దరఖాస్తుల కోసం సౌదీ అరేబియాలో ఇటీవల ‘మొతావిఫ్’ పేరుతో ప్రభుత్వ పోర్టల్ను ప్రారంభించింది. యాత్ర కోసం ప్రతీ ఒక్కరు ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ దరఖాస్తుల నుంచి ఆటోమేటెడ్ లాటరీ ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తామని తెలిపింది. హజ్పై నకిలీ ట్రావెల్ ఏజెన్సీల ఆగడాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా నుంచి వచ్చే హజ్ దరఖాస్తులను ప్రాసెస్ చేసే బాధ్యతను దుబాయ్కు చెందిన ‘ట్రావ్ఈజీ’ అనే కంపెనీకి సౌదీ అరేబియా అప్పగించింది. ఈ ట్రావ్ఈజీ కంపెనీకి బీజేపీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని ‘మిడిల్ ఈస్ట్ ఐ’ అనే వార్తా సంస్థ వెల్లడించింది. ట్రావ్ఈజీ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ప్రకాశ్ 2020లో భారత జాతీయ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేశారని తెలిపింది.
2021 నుంచి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి విధానపరమైన సలహాదారుగా ఉన్నట్టు పేర్కొన్నది. ట్రావ్ఈజీలో ప్రశాంత్ ప్రకాశ్ 2016 నుంచి భాగస్వామిగా ఉన్నారు. భారీగా పెట్టుబడులు పెట్టారు. బీజేపీతో సంబంధాలున్న వ్యక్తికి చెందిన కంపెనీకి ఈ కాంట్రాక్ట్ అప్పగించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నదని, బీజేపీ సర్కారు హయాంలో ముస్లింలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన నబియా ఖాన్ పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమని, ముస్లింలకు సంబంధించిన డాటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నదని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.