నాలుగింట మూడొంతులు కాదు.. బీజేపీకి వచ్చేవి 3-4 సీట్లే!
యూపీలో యోగీకి క్రికెట్ ఆడటం రావట్లేదు.. బీజేపీ వికెట్లు ఒకటి తర్వాత ఒకటి టపటపా రాలుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య పార్టీని వీడటంతో ఆ పార్టీకి ఉన్న 20 శాతం ఓట్లు కూడా పోయాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాలుగింట మూడొంతుల సీట్లు కాదు.. మూడు, నాలుగు సీట్లే వస్తాయి. సైకిల్ చాలా బలంగా ఉన్నది. ఇప్పుడు సమాజ్వాదీతో అంబేద్కర్ వాది కలిశారు. సైకిల్ను ఆపడం ఇక ఎవరి తరమూ కాదు. -ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ షురూ
బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ నా రాజీనామాతోనే మొదలైంది. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరడం ద్వారా బీజేపీ పతనానికి శంఖం పూరిస్తున్నా. యూపీ ప్రజల కండ్లల్లో బీజేపీ దుమ్ము కొట్టింది. దోపిడీకి తెగబడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి యూపీ ప్రజలు దోపిడీ నుంచి, ఆ పార్టీ నుంచి విముక్తులు కావాలి.
-స్వామి ప్రసాద్ మౌర్య, యూపీ మాజీ మంత్రి
నేతలు బీజేపీని వీడని రోజే లేదు
ఉత్తరప్రదేశ్లో వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం లేదని, సొంతంగా అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు 15 రోజుల క్రితం గొప్పలు చెప్పుకొన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నుంచి రోజుకో నేత వెళ్లిపోతున్నారు. యూపీలో బీజేపీ నేతలు పార్టీని వీడని రోజు ఒక్కటి కూడా ఉండటం లేదు. -ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
నూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాడు కూడా బీజేపీకి ఎదురే ఉండదన్నవారు కూడా ఇప్పుడు అభిప్రాయాలు మార్చుకొంటున్నారు. యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గూటికి చేరుతున్నారు. ఇలా వెళ్లిపోతున్నవారంతా ఓబీసీ నేతలే కావటంతో బీజేపీలో అలజడి మొదలైంది. మూడొంతుల మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొన్న కమలనాథులు ఇప్పుడు ఓటమి తప్పించుకొనేందుకు చెమటోడుస్తున్నారు. యూపీకి ఒక చిత్రమైన చరిత్ర ఉన్నది. గత 30 ఏండ్లలో అక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలవలేదు. మరో విశేషమూ ఉన్నది. అక్కడి రాజకీయాల్లో మతం ఎంత కీలకమైనదో, కులం అంతకన్నా బలమైనది. ఈ రెండు సూత్రీకరణలను బట్టి చూస్తే, మళ్లీ బీజేపీదే విజయమని సర్వేల పేరుతో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం మైండ్గేమేనా అన్న అనుమానం రాకమానదు. (సర్వే సంస్థలు బెంగాల్ విషయంలోనూ ఇలాగే బీజేపీ గెలుస్తుందని పుంఖానుపుంఖాలుగా ముందస్తు అంచనాలు వేశాయి. కానీ జరిగింది పూర్తిగా భిన్నం) ఎందుకంటే, ఆ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చాపకింద నీరులా సాగుతున్న పరిణామాలకు, సర్వే సంస్థలు చెప్తున్న దానికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి 4 రోజుల్లో ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మొత్తమ్మీద 10-12 మంది మంత్రులు, 40-50 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయేట్టు ఉన్నారని బీజేపీ నేతలే గుసగుసలాడుకొంటున్నారు.
ఏదో ప్రమాదం ఉందని సంకేతాలు అందితే తప్ప, అధికార పార్టీ నుంచి ఇలా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం చాలా అరుదు. అందునా బీజేపీ మరో రెండున్నరేండ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉండబోతున్నది. టికెట్లు దక్కవనుకున్న వాళ్లే వెళ్లిపోతున్నారని బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, అసలు సంగతి వేరని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. దేశం మొత్తంలో ఎక్కడేం జరిగినా తమకు క్షణాల్లో తెలిసిపోతుందని చెప్పే మోదీ- అమిత్షా ద్వయానికి, యూపీ బీజేపీలో ఏం జరగబోతోందన్నదానిపై చిన్న క్లూ కూడా లేదని ఢిల్లీ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘వరుస రాజీనామాలతో మా అధిష్ఠానం ఒకరకంగా షాక్కు గురైంది. పార్టీ ముఖ్యనేతలతో మోదీ- షా దాదాపు 10 గంటల చర్చలు జరిపిన తర్వాత కూడా తాజా పరిణామాలపై, తర్వాతి చర్యలపై ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు’ అని ఆ సమావేశంలో పాల్గొన్న యూపీ నాయకుడొకరు చెప్పారు. పార్టీలో ఎవరుంటారో, ఎవరు పోతారో తెలియని దిక్కుతోచని స్థితిని మా నాయకత్వం ఎదుర్కొంటున్నది అని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. తమ మైండ్గేమ్పై ఎస్పీ అధినేత అఖిలేశ్ పైచేయి సాధించారని, ఇది అంగీకరించక తప్పని వాస్తవమని ఆయన పేర్కొన్నారు.
అఖిలేశ్ రేసుగుర్రం
యూపీలో చర్చ ఇప్పుడు యోగి పాలనపై, మోగి (మోదీ+యోగి) హిందుత్వపై, అమిత్షా చాణక్యంపై కాకుండా, అఖిలేశ్ వేసే ఎత్తులపైనే జరుగుతున్నది. బీజేపీ నుంచి ఇంకా ఎంతమంది వెళ్లిపోతారన్నదే ఇప్పుడు టాక్ ఆఫ్ది టౌన్గా మారింది. ‘వలసలను ఆపే ఉపాయం కూడా మాదగ్గర లేదు. మోదీ- షా అంటే ఇప్పుడు యూపీ నేతలకూ ఎలాంటి భయమూ- భక్తి లేవని, వాళ్లు వెళ్లిపోతున్న తీరు, చేస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతున్నది’ అని మరో నేత విశ్లేషించారు. పార్టీ నుంచి వలసలు ఇలాగే కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నదని యూపీ, ఢిల్లీలోని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదే ట్రెండ్ ఉంటే ఎస్పీ 300 పైచిలుకు సీట్లతో విజయం సాధిస్తుందని, గెలిచే పార్టీకి బీజేపీకి కనీసం వంద సీట్లు తేడా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
కులమే బలం
యూపీలో ప్రధానంగా ఐదు ఓటింగ్ గ్రూపులున్నాయి. 1.బ్రాహ్మణులు- అగ్రకులాలు 2. ముస్లింలు 3. యాదవేతర ఓబీసీలు 4. యాదవులు 5. జాతవులు (దళితుల్లోని ఒక వర్గం). ఎవరు అధికారంలోకి వచ్చినా వీటిలో రెండు గ్రూపుల సంపూర్ణ మద్దతుతోనే. 2007లో ముస్లిం- జాతవ్ మద్దతుతో బీఎస్పీ అధికారంలోకి వస్తే, 2012లో ముస్లిం- యాదవ్ మద్దతుతో ఎస్పీ గద్దెనెక్కింది. 2017లో మాత్రం మోదీ గాలిని ఆలంబనగా చేసుకుని, సోషల్ ఇంజినీరింగ్ను బీజేపీ మార్చింది. యాదవేతర ఓబీసీలను, జాతవేతర ఎస్సీలను తనవైపునకు తిప్పుకొన్నది. టాయిలెట్లు, వంటగ్యాస్ సిలిండర్ల వంటి కేంద్ర పథకాలను వారికి ఆశజూపింది. యాదవులు, జాతవుల మీద ఓబీసీలు, దళితుల్లో ఉండే కోపాన్ని తనవైపునకు తిప్పుకొన్నది. అదే సమయంలో ముస్లింల ఓట్లు ఎస్పీ- బీఎస్పీ మధ్య చీలిపోయాయి. దీంతో బీజేపీ 40 శాతం ఓట్లతో అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాదవ- యాదవేతర విభేదాలకు అతీతంగా ఓబీసీ కన్సాలిడేషన్ జరుగుతున్నదని పేర్కొంటున్నారు. ‘ఇప్పుడు బీజేపీ వద్ద మోదీ- హిందుత్వ మాత్రమే ఉన్నాయి. ఇక యోగి అదిత్యనాథ్ ఠాకూర్ వర్గీయుడు. ఆయన తీసుకొన్న కొన్ని నిర్ణయాలతో బ్రాహ్మణులు, యాదవేతర ఓబీసీలు ఆగ్రహంగా ఉన్నారు. మోదీ క్షమాపణ చెప్పినా, రైతు చట్టాల పట్ల జాట్ రైతుల కోపం ఇంకా చల్లారలేదు. మోదీ ప్రభుత్వంలో తమకేమీ న్యాయం జరగలేదని యాదవేతర ఓబీసీలు భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన వారంతా ఆ వర్గాలకు చెందిన వారే. ఇక కరోనా విపత్తును యోగి సర్కారు ఎదుర్కొన్న తీరు దేశవ్యాప్తంగా విమర్శలకు గురైంది. కరోనా వల్ల యూపీ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినా, వారిని ఆదుకొనేందుకు యోగి సర్కారు తీసుకున్న చర్యలేమీ లేవు’ అని ఢిల్లీకి చెందిన ప్రముఖ పాత్రికేయుడొకరు విశ్లేషించారు.
సీనియర్ల గుర్రు
పైకి కనిపిస్తున్నవాటికంటే లోతైన రాజకీయ కారణాలు కూడా బీజేపీని దెబ్బకొట్టనున్నట్టు యూపీలోనే పని చేస్తున్న అధికారి ఒకరు వివరించారు. ‘మొదటినుంచీ యూపీ బీజేపీకి ఆయువు పట్టు. వాజ్పేయి, మురళీ మనోహర్ జోషీ, రాజ్నాథ్సింగ్, కల్యాణ్సింగ్, కల్రాజ్మిశ్రా, లాల్జీ టాండన్ వంటి యోధానుయోధులను అందించిన గడ్డ. అయితే గుజరాత్కు చెందిన మోదీ- షా ద్వయం బీజేపీని హస్తగతం చేసుకొని, పార్టీలో తమకు ఏమాత్రం విలువ లేకుండా చేశారని యూపీ బీజేపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. మోదీ- షా ద్వయానికి గుణపాఠం నేర్పడానికి యూపీని వారు ఒక అవకాశంగా భావిస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆద్వాణీ, జోషీలకు యూపీ బీజేపీపై ఇంకా గట్టి పట్టుంది. కల్రాజ్మిశ్రా, రీటా బహుగుణ జోషీ, రాజ్నాథ్సింగ్, తదితర అనేక ముఖ్యనేతలు వారికి విధేయులు. వారి అసంతృప్తి యూపీలో బీజేపీ విజయావకాశాలపై పెను ప్రభావం చూపించనున్నది’ అని బీజేపీ రాజకీయాలను మొదటి నుంచీ కవర్ చేస్తున్న ఢిల్లీ పాత్రికేయుడొకరు పేర్కొన్నారు. సాధారణ వివేకంతో చూస్తే, యూపీలో 35 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారు అధికారంలోకి వస్తారు. మరోసారి 40 శాతం ఓట్లు గెలుచుకుంటామని బీజేపీ భావిస్తున్నది. కులాల లెక్కలు అందుకు సపోర్ట్ చేయడం లేదు. ‘యాదవ- యాదవేతర విభేదాలకు అతీతంగా ఓబీసీలు ఎస్పీ చెంతకు చేరుతున్నారు. వీళ్ల ఓట్లే 39% దాకా ఉన్నాయి. బీఎస్పీ సైడ్లైన్ అయిపోయింది. అందువల్ల గతంలోలాగా ముస్లిం ఓట్లలో చీలిక ఉండకపోవచ్చు. వారంతా మూకుమ్మడిగా అఖిలేశ్కు మద్దతిచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ ఓటుబ్యాంకుగా ఉన్న బ్రాహ్మణుల్లో (10 శాతం) కూడా తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. అందువల్ల ఏ లెక్క చూసినా బీజేపీకి లెక్క సరిపోవడం లేదు.
స్వామి ప్రసాద్ మౌర్య: మౌర్య (ఓబీసీ)
రాజకీయ ప్రాధాన్యం: కుషీనగర్, ప్రతాప్గఢ్, కాన్పూర్ దేహట్, బందా, షాజహాన్పూర్ జిల్లాల్లోని కనీసం 20 నియోజవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల నేత.
ధరమ్సింగ్ చౌహాన్: చౌహాన్ (ఓబీసీ)
రాజకీయ ప్రాధాన్యం: చౌహాన్ కులంలో మంచి పట్టున్న నేత. కనీసం పది స్థానాల్లో
ఫలితాలను ప్రభావితం చేయగలరు.
ధరమ్సింగ్ సైనీ: ఓబీసీ
రాజకీయ ప్రాధాన్యం: సర్సావా, నాకూర్ ప్రాంతాల్లో మంచి పట్టున్న నేత
బాలా అవస్థి : బ్రాహ్మణ
రాజకీయ ప్రాధాన్యం: టెరాయ్ ప్రాంతంలో మంచి పట్టున్న నేత. బ్రాహ్మణుల్లో బలమైన నాయకుడు.
రోషన్లాల్ వర్మ ఓబీసీ
బ్రిజేశ్ ప్రజాపతి ఓబీసీ
అవతార్సింగ్ బందారా గుజ్జర్
వియన్ శాక్య ఓబీసీ
ముఖేశ్ వర్మ ఓబీసీ
భగవతి సాగర్ ఎస్సీ