న్యూఢిల్లీ: అన్నదాతలు తమ ప్లాన్ మార్చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంట్ను ముట్టడి చేసేందుకు ప్లాన్ చేసిన మార్చింగ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ శీతాకాల సమావేశాల తొలి రోజునే ప్రభుత్వం బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా నేతల ఇవాళ మీటింగ్ నిర్వహించారు. అయితే సాగు చట్టాలపై కేంద్రం యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో కిసాన్ మోర్చా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రైతులు తమ ఆందోళనలను విరమించాలని ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. శీతాకాల సమావేశాల తొలి రోజున పార్లమెంట్కు మార్చింగ్ నిర్వహించాలని తొలుత రైతులు నిర్ణయించారు. 60 ట్రాక్టర్లు, వెయ్యి మందితో ఛలో పార్లమెంట్లో పాల్గొనాలని భావించారు. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని వారం క్రితం ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.