బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటి తీర్పును వెలువరించింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడిన 11మంది దోషులు ముందస్తుగా విడుదల చేయడాన్ని రద్దు చేసింది. హత్యలు, లైంగికదాడికి పాల్పడిన దోషులకు యావజ్జీవ శిక్ష నుంచి ఉపశమనం కలిగించడాన్ని సుప్రీం తీవ్రంగా తప్పుబట్టింది. దోషులను రెండువారాల్లో తిరిగి జైలుకు పంపాలని ఆదేశించింది.
Bilkis Bano | న్యూఢిల్లీ, జనవరి 8: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సోమవారం రద్దు చేసింది. బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి హత్యలు, లైంగికదాడికి పాల్పడిన దోషులకు శిక్ష నుంచి ఉపశమనం కలిగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. గోద్రా అల్లర్ల సందర్భంగా 2002లో బిల్కిస్ బానోకు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చడమే కాకుండా ఐదు నెలల గర్భిణీ అయిన ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మందిని రెండు వారాల్లో తిరిగి జైలుకు పంపాలని ఆదేశించింది.
గుజరాత్ ప్రభుత్వం మతి లేకుండా దోషుల విడుదలకు రెమిషన్ (శిక్షా కాలం తగ్గింపు) ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బాధిత మహిళ ఏ జాతికి చెందినదైనా లేక ఏ మతానికి చెందినదైనా ఆమెపై అత్యంత నీచమైన నేరానికి పాల్పడిన వారికి శిక్షా కాలాన్ని తగ్గించవచ్చా? అని ప్రశ్నించింది. గోద్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన అల్లర్ల సందర్భంగా దుండగుల నుంచి తప్పించుకొని పారిపోతున్న బిల్కిస్ బానోను దుండగులు నిర్బంధించి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ అల్లర్లలో మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులలో మూడేండ్ల బిల్కిస్ బానో కుమార్తె కూడా ఉన్నది. తనపై లైంగికదాడి జరిగినప్పుడు ఆమె ఐదు నెలల గర్భవతి. ఈ కేసులో దోషులైన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం 2022, ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గుజరాత్ ప్రభుత్వం దోషులకు అనుకూలంగా జారీచేసిన రెమిషన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. దోషుల శిక్షా కాలాన్ని తగ్గించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తమ 100 పేజీల ఉత్తర్వులలో స్పష్టంచేసింది. ఏ రాష్ట్రంలోనైతే నేరస్థులపై విచారణ జరిగిందో, ఎక్కడైతే వారికి శిక్ష పడిందో ఆ ప్రభుత్వమే వారి శిక్షా కాలాన్ని తగ్గించే విషయమై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బిల్కిస్ బానో కేసును మహారాష్ట్రలో విచారణ జరిపారు. దోషుల శిక్షా కాలాన్ని తగ్గించే అధికారం మహారాష్ట్రకు తప్ప గుజరాత్కు లేదని స్పష్టం చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తూ గుజరాత్ ప్రభుత్వం తనకు లేని అధికారాలను ఉపయోగించి.. దుర్వినియోగం చేసిందని వ్యాఖ్యానించింది. అందువల్ల కూడా ఆ ప్రభుత్వం జారీచేసిన రెమిషన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని బిల్కిస్బానో ఆందోళన వ్యక్తంచేయడంతో గుజరాత్ హైకోర్టు అప్పట్లో ఆమె కేసును అహ్మదాబాద్ నుంచి ముంబైకి బదిలీ చేసింది.
దోషులలో ఒకడు తన శిక్షా కాలాన్ని తగ్గించాలని కోరుతూ చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని సుప్రీంకోర్టు మరో ధర్మాసనం 2022, మే 13న ఇచ్చిన ఆదేశాలను కూడా రద్దు చేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఆ దోషి వాస్తవాలను కప్పిపుచ్చి మోసపూరితంగా కోర్టు నుంచి ఆ ఆదేశాలను పొందాడని పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించేందుకు కోర్టు ఉత్తర్వులను వాడుకున్న ఓ ప్రత్యేకమైన కేసు ఇది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మే 13న ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని గుజరాత్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ ఉత్తర్వులను అవకాశంగా తీసుకొని ఇతర దోషులు కూడా తమ శిక్షా కాలాన్ని తగ్గించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారని.. గుజరాత్ ప్రభుత్వం వారికి అనుకూలంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. వాస్తవాలను కప్పిపుచ్చి ఆ దోషి కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాడని పేర్కొంది.
‘జరిగిన తప్పును సరిదిద్దేందుకు ప్రతీకారంగా శిక్ష విధించరు కానీ, ఇక ముందు అటువంటి నేరాలు జరుగకుండా నివారించడం, సంస్కరించడం కోసం శిక్షలు వేస్తారు’ అంటూ జస్టిస్ నాగరత్న గ్రీకు తత్వవేత్త ప్లేటోను ఉటంకించారు. ‘దోషులు తాము చేసిన నేరానికి శిక్ష నుంచి తప్పించుకుంటే.. సమాజంలో శాంతి, సామరస్యాలు అగాథంలో పడిపోతాయి. ఏకపక్షంగా జారీ అయిన ఆదేశాలను సాధ్యమైనంత త్వరగా సరిదిద్ది, ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత కోర్టులదే’నని అన్నారు.
దోషుల విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్ బానోతోపాటు సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లౌల్ తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు 11 రోజులపాటు ఏకధాటిగా విచారణ చేసి గత ఏడాది అక్టోబర్ 12న తీర్పును రిజర్వులో ఉంచింది. దోషుల శిక్షా కాలాన్ని తగ్గించడానికి సంబంధించిన పత్రాలను తమకు అక్టోబర్ 16లోగా అందజేయాలని అదే రోజున కేంద్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎన్నికైన ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని బిల్కిస్ బానో వ్యవహారంతో మరోసారి రుజువైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన్ ఎక్స్ ద్వారా స్పందించారు. ‘బిల్కిస్ బానోకు న్యాయం చేసిన సుప్రీంకోర్టుకు, ప్రముఖ న్యాయవాదులకు ధన్యవాదాలు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వంపై, అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై గట్టి చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఎన్నికైన ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరించరాదని ఈ వ్యవహారం స్పష్టం చేస్తున్నది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో కలిగిన ఉపశమనంతో కన్నీళ్లు వచ్చాయి. గత ఏడాదిన్నర కాలంలో తొలిసారి నవ్వా. ఈ రోజే నాకు నిజమైన కొత్త ఏడాది. తీర్పుతో గుండెలపై ఉన్న కొండ అంత పెద్ద రాయిని దింపేసినట్లయింది.. న్యాయం అంటే ఇదే అనిపిస్తున్నది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. అందరికీ సమన్యాయం దక్కుతుందనే ఆకాంక్ష, నిరూపణకు తాజా తీర్పు నిదర్శనం. దేశంలోని ప్రతి స్త్రీకి న్యాయం చేయాలనే ఆలోచనను రక్షించేందుకు మీరు పోరాడాలనే సంకల్పాన్ని ఇచ్చారు.
– సుప్రీంకోర్టు తీర్పుపై బిల్కిస్ బానో