పాట్నా: నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన గ్రామస్తులు వెంబడించి మరీ పోలీసులపై దాడి చేశారు. బీహార్లోని సీతామర్హి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిత్తా గ్రామానికి చెందిన ముఖేష్ సాహ్ని మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపించిన గ్రామస్తులు మంగళవారం భారీ స్థాయిలో నిరసనకు దిగారు. గ్రామంలోని అన్ని రోడ్లను దిగ్బంధించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి చేరుకున్నారు. గుంపుగా ఉండి నిరసన చేస్తున్న గ్రామస్తులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. పోలీస్ వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. వాటిని ధ్వంసం చేశారు. కొందరు గ్రామస్తులు పోలీసులను వెంబడించి దాడి చేశారు. కర్రలతో పోలీసులను కొట్టారు. దీంతో ప్రాణ భయంతో పలువురు పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. మహిళలతో సహా 25 మందిని అరెస్ట్ చేశారు. అల్లర్లకు పాల్పడటంతో పాటు పోలీసులపై దాడి చేసిన 54 మంది వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Protesting Bihar Villagers Attack Police Van, Chase Away Cops https://t.co/76yCUEiGC2 pic.twitter.com/VJpp4n8pdf
— NDTV (@ndtv) February 22, 2023