పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ 2025 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని పీకే వ్యాఖ్యానించారు. ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ సర్కారులో అతిపెద్ద పార్టీ ఆర్జేడీయేనని, కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే హక్కు తేజస్వికే ఉందని ఆయన పేర్కొన్నారు.
నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. దానివల్ల తేజస్వి యాదవ్కు వచ్చే ఎన్నికల నాటికి మూడేండ్ల పరిపాలన అనుభవం వస్తుందని, బీహార్ ప్రజలకు తేజస్వి పనితనాన్ని చూసి ఓటు వేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.
2020 శాసనసభ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో, మహా కూటమి 110 స్థానాల్లో గెలుపొందాయి. దాంతో ఎన్డీఏ నుంచి జేడీయూ నాయకుడు నితీశ్కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆ తర్వాత నితీశ్ బీజేపీతో విభేదించి ఆర్జేడీతో జట్టు కట్టాడు. తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు.
అయితే పార్టీలుగా చూసినప్పుడు ఆర్జేడీ 75 సీట్లలో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. అయినా తక్కువ మంది ఎమ్మెల్యేలున్న నితీశ్ ముఖ్యమంత్రిగా, ఎక్కువ బలం ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కరెక్టు కాదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడుతున్నారు.