వారు పనిచేస్తేనే సమాజం ముందుకు సాగుతుంది. వారి రెక్కల కష్టమే సమాజానికి మేలు కొలుపు. ఒక్కరోజు వారు పనిచేయకపోతే మహానగరం స్తంభించిపోతుంది. కరోనా కష్టకాలంలో వారు తమ కర్తవ్యాన్ని మరింత బాధ్యతగా చేపడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెడుతూ పనిచేస్తున్నారు. వారే జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు. ఇక ముందు పొద్దు పొడిచే లోపే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఉదయం ఆరు గంటలకు విధుల్లోకి వచ్చే పారిశుశధ్య కార్మికులు ఇక మీదట ఉదయం ఐదు గంటలకే చీపురు పట్టి మన చుట్టూ ఉన్న కాలనీలను శుభ్రం చేయనున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని పని సమయ వేళల్లో మార్పులు చేపడుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18,550 మంది కార్మికులు పనిచేస్తుండగా, రోజూ దాదాపు ఆరువేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి తరలిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరోనా ఆపత్కాలంలో శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల శ్రమను వెలకట్టలేము. ఇక ముందు నగరం మేల్కొనే లోపే కార్మికులు నగరాన్ని అద్దంలా చేయనున్నారు.