పట్నా: బీహార్లో ఆర్జేడీ నాయకుల ఇండ్లపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇవన్నీ బీజేపీ ప్రేరేపిత దాడులేనని ఆర్జేడీ సీనియర్ నేత మనోజ్ కుమార్ ఝా ఆరోపించారు. అసెంబ్లీలో బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలోనే తమపైకి సీబీఐని ఉసిగొల్పారని విమర్శించారు. ఇదంతా తాము ముందే ఊహించామని చెప్పారు. అయినా ప్రస్తుతం జరుగుతున్నవి ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు కాదని, అవన్నీ బీజేపీ చేయిస్తున్న దాడులని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ ఇప్పుడు కాషాయ పార్టీ కింద పనిచేస్తున్నాయి. వారి కార్యాలయాలు బీజేపీ ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నాయని మనోజ్ కుమార్ చెప్పారు.
కాగా, సీబీఐ దాడులు తమ పార్టీని భయపెట్టలేవని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమతోనే ఉన్నాయని చెప్పారు. పూర్తిస్థాయి మెజారిటీ ఉందన్నారు. తమని భయపెట్టడానికే సీబీఐ దాడులు జరిపిస్తున్నారని, అయినా తాము ఎట్టిపరిస్థితుల్లో బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని వెల్లడించారు.