INDIA Alliance | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జట్టు కట్టిన విపక్ష కూటిమి ‘ఇండియా’లో సీట్ల పంపకంలో తకరారు నడుస్తున్నది. ఎన్నికలకు ఏడాది సమయమున్నా భాగస్వామ్య పార్టీలు అప్పుడే లోక్సభ సీట్ల కేటాయింపులో సిగపట్లు పట్టుకుంటున్నాయి. బీహార్లో జేడీయూ నేత, సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్యాదవ్ గత రెండు, మూడు రోజులుగా సీట్ల పంపకంలో ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు.
లాలూ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో సీఎం నితీశ్ (జేడీయూ) అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. సీఎం నితీశ్ ప్రభుత్వం ఉండాలన్నా.. ఆ పార్టీల మద్దతు కొనసాగాలన్నా జేడీయూ రానున్న ఎన్నికల్లో కొన్ని సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అందుకు ఆయన సిద్ధంగా లేరు.
రాష్ట్రంలో 40 లోక్సభ సీట్లుండగా, ప్రస్తుతం జేడీయూకి 16 మంది ఎంపీలున్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ గెలుచుకున్న సీతామడీ, మధేపురా, గోపాల్గంజ్, సివాన్, భాగల్పుర్, బాంకా లోకసభ సీట్లు కేటాయించాలంటూ లాలూ పట్టుబడుతున్నారు. ఆ సీట్లు వదులుకుంటే సీఎం నితీశ్ కుమార్ తన పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితున్నాయి. దీనిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.