పాట్నా: ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. ఈ నెల 23న పాట్నా వేదికగా జరిగే బీజేపీ యేతర పార్టీల నాయకుల సమావేశంలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించనున్నారని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికలు ప్రధాని మోదీ పేరుతో కాకుండా ప్రజా సమస్యలే ప్రధాన అంశంగా జరుగనున్నాయని వెల్లడించారు.
కేంద్రంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యతను చాటేలా జూన్ 23న పాట్నాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్తో పాటు టీఎంసీ, ఎన్సీపీ, ఆప్ సహా పలు విపక్ష పార్టీలు పాల్గొననున్నాయి.