పట్నా : బిహార్ సీఎంగా నితీష్ కుమార్ బుధవారం ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. 2014లో ఆయన (మోదీ) గెలిచారు..కానీ ఇప్పుడు 2024 ఎన్నికలపై ఆయన కలత చెందాలని వ్యాఖ్యానించారు.
2024 లోక్సభ ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్ధిగా తెరపైకి వస్తాననే వార్తలను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. తాను అలాంటి (ప్రధాని) పదవులకు పోటీదారును కానని స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన వారు 2024లోనూ గెలుస్తారా అని నితీష్ ప్రశ్నించారు. 2024 ఎన్నికల కోసం విపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఇక బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీష్ తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలతో కూడిన మహా కూటమితో చేతులు కలిపారు. బిహార్ సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.