న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా బీహార్లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు కాంగ్రెస్ చీఫ్తో సమావేశమవున్నారు. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్కుమార్ భేటీకానున్నారు. గత ఐదేండ్లలో ఈ ముగ్గురు అగ్రనాయకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి.
కాగా, ఇద్దరు నాయకులు మర్యాదపూర్వకంగా మాత్రమే సోనియాతో భేటీ కాబోతున్నారని, ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని, అందులో జాతీయస్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశం ఉండొచ్చునని తెలుస్తున్నది.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామపి లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీహార్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జంగిల్రాజ్ గురించి మాట్లాడని అమిత్ షా.. ఇప్పుడు మాట్లాడుతున్నారని, అసలు జంగిల్రాజ్ గుజరాత్లో ఉన్నదని చురక అంటించారు. అమిత్ షా ఓ పిచ్చోడని, తెలివి తక్కువ వ్యక్తని విరుచుకుపడ్డారు. బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే పీకిపారేశామో.. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు.