తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలుకుతున్నట్లు చెప్పిన ఆయన.. ‘కేసీఆర్ ఇక్కడకి వచ్చేందుకు సమయం కేటాయిచండం చాలా సంతోషకరం. గల్వాన్ లోయ అమరవీరులకు రూ. 10 లక్షలు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికులకు రూ.5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించడం గొప్ప విషయం.
తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో బీహార్ వాసులను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేయడం వారి ఉదారతకు తార్కాణం. తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన కార్యాచరణను మరే ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ 2001 నుంచి ఉద్యమించారు. ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో ప్రజల దీవెనలతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, వికాసంలో కేసీఆర్ భాగస్వామ్యం ఎంతో గొప్పది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథంలో నిలిపిన కేసీఆర్.. ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ పథకం గొప్ప పథకం. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యం. తెలంగాణ తెచ్చిన సీఎంను ప్రజలు వదులుకోరు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రేరణతో బీహార్లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తాం. వ్యవసాయోగ్యమైన భూమి, పచ్చదనం ఎంత ఎక్కువ ఉంటే అంతగా సమాజం వర్ధిల్లుతుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్కే సాధ్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలకు అందే నిధులకు కేంద్రం కోత పెడుతున్నది. ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే బీహార్ చాలా గొప్పగా ఉండేది.
రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం మరిచింది. నాకు హైదరాబాద్తో అవినాభావ సంబంధం ఉంది. అటల్ బీహార్ వాజ్పేయ్ నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం బాగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి మరోమారు అభినందనలు’ అని తెలిపారు.
కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి. మీ భాగస్వామ్యం చాలా గొప్పది. మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది. ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు. అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు. మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత. అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారు. వదులుకునే ప్రసక్తే ఉండదు. మీరు పట్టువదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండి’ అన్నారు.