CM Nitish Kumar | న్యూఢిల్లీ, జూన్ 14: లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగాల్సిన అవసరం లేదని, గడువుకన్నా ముందే జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ర్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య జరిగే అవకాశాలున్నాయని ఇటీవల పలువురు పరిశీలకులు కూడా పేర్కొనటం ముందస్తుపై ఊహాగానాలకు ఆస్కారమిస్తున్నది. తొమ్మిదేండ్ల మోదీ పాలనపై అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం బడాబాబులు, పారిశ్రామికవేత్తలకే తప్ప సామాన్యులు, మధ్య తరగతి వారి కష్టాలు, రైతుల ఇబ్బందులు మోదీ ప్రభుత్వానికి అక్కర్లేదనే విమర్శ గట్టిగా విన్పిస్తున్నది. రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కనీస మద్దతు ధర లభించక కర్షకులు అల్లాడుతున్నారు.
ఇటీవల పెంచిన ఎంఎస్పీ కేవలం కంటితుడుపు మాత్రమేనని, చాలా రాష్ర్టాల్లో ఎంఎస్పీ అమలే కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కోట్లాది ఉద్యోగాలిస్తామన్న బీజేపీ ప్రభుత్వ హామీ కేవలం నీటిమూటగానే మిగిలిపోయింది. గ్యాస్ బండ వెయ్యి రూపాయలు దాటడం, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలచూపులు చూస్తున్నా పెట్రోల్ ధరలు తగ్గించకపోవడాన్ని ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నారు. ఇక పప్పు దినుసులు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఎప్పుడో ఆకాశాన్నంటాయి. దేశానికి పతకాలు తెచ్చిన రెజ్లర్లు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను బీజేపీ వెనకేసుకు వస్తున్నదే తప్ప ఆడబిడ్డలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలన్న ఆలోచన మోదీ ప్రభుత్వానికి ఏ కోశాన కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత మరింత తీవ్రం కాకముందే లోక్సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని అధికార బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
నిత్యం జమిలి ఎన్నికల జపం చేసే బీజేపీ ఓటమి భయంతో ఈ ఏడాదే దానిని ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్సభకు కూడా ఎన్నికలు నిర్వహించి జమిలికి శ్రీకారం చుట్టవచ్చని భావిస్తున్నారు.
ఇటీవల దక్షిణాదిన కర్ణాటక ఎన్నికలలో అధికారంలో ఉన్న బీజేపీకి చావుదెబ్బ తగలడాన్ని అగ్రనేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితం దేశమంతటా పునరావృతం అయితే ఘోర ఓటమి తప్పదన్న భయం ఆ పార్టీ నేతలను వేధిస్తున్నది. అధికారంలో ఉన్నప్పటికీ ఘోరంగా ఓడిపోవడం చూస్తుంటే తమపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉందన్న విషయం అర్థమైన నేతలు దానినుంచి బయటపడటానికి ముందస్తు ఎన్నికల యోచన చేస్తున్నారని భావిస్తున్నారు.
లోక్సభ ఎన్నికలు గడువు ప్రకారం వచ్చే సంవత్సరం కాకుండా ఈ ఏడాదే జరగొచ్చని బీహార్ సీఎం నితీశ్ పేర్కొన్నారు. ఈ నెల 23న బీహార్లో విపక్షాల ఐక్యతా సమావేశం జరుగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను 2024 జనవరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని, లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా జరుగొచ్చని చెప్పారు. ‘లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరగాల్సిన అవసరం లేదు. ముందుగానే జరగవచ్చు. అది ఈ ఏడాదే కావచ్చు’ అని వ్యాఖ్యానించారు.
వచ్చే వారం పాట్నాలో నిర్వహించనున్న విపక్షాల ఐక్యతా సమావేశంలో ఉమ్మడి అజెండాపై దృష్టి సారించనున్నట్టు ఆర్జేడీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. అందరికీ అమోదయోగ్యమైన ప్రధాని అభ్యర్థిపై ఈ సమావేశంలో చర్చ ఉండదని స్పష్టంచేశాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నోట్ల రద్దు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తదితర ప్రధానాంశాలపై చర్చ జరుగుతుందని ఆర్జేడీ నాయకుడొకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ప్రతిపాదించవచ్చని ఆయన తెలిపారు.