BJP on Nitish Kumar | సైనిక బలగాల్లో నియామకాలకు కేంద్రం తెచ్చిన అగ్ని పథ్ పథకాన్ని నిరసిస్తూ బీహార్లో నిరసనలు వెల్లువెత్తాయి. కానీ ఈ ఆందోళనను అడ్డుకునేందుకు బీహార్లోని నితీశ్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మిత్రపక్షం బీజేపీ గుర్రుగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు డిప్యూటీ సీఎంలకు కేంద్రం వై క్యాటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
గత మూడు రోజులుగా బీహార్లో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని బీజేపీ ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇంటిని నిరసన కారులు ధ్వంసం చేశారు. పలువురు నేతల ఇండ్లపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు.. కొందరి కార్లకు నిప్పు పెట్టారు. ఆందోళనల కట్టడిలో పోలీసులు విఫలం అయ్యారని, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీరుపై ప్రధాని నరేంద్రమోదీ.. తమ పార్టీ నేతలకు భద్రత కల్పించాలని నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల కథనం.
రాష్ట్రంలో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై నితీశ్ సర్కార్ ఎందుకు చర్య తీసుకోవడం లేదని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ప్రశ్నించారు. నిరసనకారులకు స్వేచ్ఛనిచ్చారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉన్నా.. నేతల ఆస్తులపై దాడులను నియంత్రించడానికి చర్యలు తీసుకోకపోవడం సరి కాదన్నారు.