Karnataka | బెంగళూరు, జనవరి 31: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అత్యధిక సీట్లలో గెలిపించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు గ్యారెంటీలను నిలిపేస్తామని ప్రజలను అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సీ బాలకృష్ణ బహిరంగంగానే హెచ్చరించారు. ఈ అంశంపై తాను సీఎం సిద్ధరామయ్యతోనూ, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్తోనూ మాట్లాడినట్టు ప్రకటించారు. బీజేపీ, సంఘ్పరివార్ పంచుతున్న అక్షింతలు కావాలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఐదు గ్యారెంటీలు కావాలో తేల్చుకోవాలని సూచించారు.
మగది అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన, ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం మరో ఐదేండ్లు అధికారంలో ఉంటది. మీ ఓటు అక్షింతలకు వేస్తారా? ఐదు గ్యారెంటీలకు వేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘మేమంతా హిందువులమే. అయోధ్యలో రామాలయం కట్టడం సంతోషమే. కానీ ఆలయం పేరుతో ఓట్లు అడగటం సరికాదు. ఒకవేళ మీరు ఆలయానికే (బీజేపీ) ఓట్లు వేస్తే.. ప్రజలు మా ఐదు గ్యారెంటీలను వద్దని తిరస్కరించినట్టు భావిస్తాం’ అని పేర్కొన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నది. బోగస్ గ్యారెంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఓట్లెయ్యకుంటే గ్యారెంటీలను అమలు చేయబోమని బ్లాక్మెయిల్కు దిగడం సిగ్గుచేటని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు.