ముంబై: మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం అయిదు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మూడు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సిట్టింగ్ సీటైన అమరావతి పట్టభద్రుల నియోజకవర్గం స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. శుక్రవారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గురువారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి సత్యజిత్ తాంబే నాసిక్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. రెండు స్థానాల్లో ఎంవీఏ అభ్యర్థులు గెలుపొందారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన మొదటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి. శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ విదర్భ (నాగ్పూర్, అమరావతి ప్రాంతాలు ఉన్నవి) ప్రజలు బీజేపీతో విసిగిపోయారన్న వాస్తవాన్ని ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. ‘ప్రజలే ప్రభువులు’ అని ఈ ఎన్నికలు నిరూపించాయని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ వ్యాఖ్యానించారు.