Milind Deora | ముంబై : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన గూటికి చేరేందుకు మిలింద్ సిద్ధమయ్యారు.
మిలింద్ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తి. మిలింద్ సౌత్ ముంబై లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. కానీ మిత్రపక్షమైన శివసేన(యూబీటీ) ఆ టికెట్ను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు సుముఖంగా లేదు. సౌత్ ముంబై నుంచి అరవింద్ సావంత్(శివసేన యూబీటీ) లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ సావంత్.. సౌత్ ముంబై నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ టికెట్ను కాంగ్రెస్ ఇవ్వడానికి శివసేన అంగీకరించడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన సౌత్ ముంబై సీటును ఇతర పార్టీలకు కేటాయించేది లేదని అరవింద్ సావంత్ స్పష్టం చేశారు.
అయితే మిలింద్ దియోరా షిండే ఆధ్వర్యంలోని శివసేనలో చేరినప్పటికీ ఆయనకు టికెట్ ఇస్తారనే గ్యారెంటీ లేదు. సౌత్ ముంబై నుంచి బీజేపీ అభ్యర్థి పోటీలో దిగే అవకాశం ఉంది. అయితే మిలింద్కు రాజ్యసభ సీటును సీఎం షిండే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళీ దియోరా కుమారుడే మిలింద్ దియోరా.