మొదటి మ్యాచ్లో పరాజయం పాలై.. ఆ తర్వాత విజృంభించడాన్ని టీమ్ఇండియా అలవాటుగా మార్చుకున్నట్లుంది. రెండు రోజుల కింద ఇదే పిచ్పై బోల్తా పడ్డ కోహ్లీ సేన.. దెబ్బకు దెబ్బకొట్టి సిరీస్ సమం చేసింది. చాన్నాళ్ల తర్వాత కోహ్లీకి టాస్ కలిసిరాగా.. బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఇక ఛేజింగ్లో రన్మెషీన్ విరాట్తో పాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపడంతో భారత్ అలవోకగా గెలుపొందింది.
అహ్మదాబాద్: తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమ్ఇండియా బదులు తీర్చుకుంది. చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేసిన భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్తో పాటు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
ఓ మాదిరి లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ మొయిడెన్గా ఆడిన లోకేశ్ రాహుల్ (0) చివరి బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో ఓవర్లోనే విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. అతడికి ఇషాన్ చక్కటి సహకారం అందించాడు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండ్రీతో తన ఉద్దేశం చాటిన ఇషాన్.. చివరి వరకు అదే జోరు కనబర్చాడు. టామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో 6,4,4తో 16 పరుగులు పిండుకున్నాడు. రషీద్ బౌలింగ్ రెండు భారీ సిక్సర్లతో అరంగేట్ర మ్యాచ్లోనే 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న ఇషాంత్.. రివర్స్ స్వీప్కు యత్నించి ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. క్రీజులో ఉన్నంతసేపు దడదడలాడించిన పంత్ మరో భారీ షాట్కు యత్నించి ఔట్ కాగా.. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన కోహ్లీ ఆఖర్లో బ్యాట్ ఝళిపించాడు. జోర్డాన్ బౌలింగ్లో వరుసగా 4,6 కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన మూడో బంతికి బట్లర్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత మలన్ (24)తో కలిసి జాసన్ రాయ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 63 పరుగులు జోడించాక చాహల్ ఈ జంట ను విడదీశాడు. బెయిర్స్టో (20), ఇయాన్ మోర్గాన్ (28), బెన్ స్టోక్స్ (24) తలా కొన్ని పరుగులు చేశారు.
ఐపీఎల్లో నిలకడగా రాణిస్తూ.. టీమ్ఇండియాకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆట ఆరంభానికి ముందు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరికి క్యాప్లు అందించి జట్టులోకి స్వాగతం పలికాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (3001) చరిత్రకెక్కాడు.
ఇంగ్లండ్: రాయ్ (సి) భువనేశ్వర్ (బి) సుందర్ 46, బట్లర్ (ఎల్బీ) భువనేశ్వర్ 0, మలన్ (ఎల్బీ) చాహల్ 24, బెయిర్స్టో (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 20, మోర్గాన్ (సి) పంత్ (బి) శార్దూల్ 28, స్టోక్స్ (సి) పాండ్యా (బి) శార్దూల్ 24, సామ్ కరన్ (నాటౌట్) 6, జోర్డాన్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 16, మొత్తం: 20 ఓవర్లలో 164/6. వికెట్ల పతనం: 1-1, 2-64, 3-91, 4-119, 5-142, 6-160, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-28-1, సుందర్ 4-0-29-2, శార్దూల్ 4-0-29-2, పాండ్యా 4-0-33-0, చాహల్ 4-0-34-1.
భారత్: రాహుల్ (సి) బట్లర్ (బి) సామ్ కరన్ 0, ఇషాన్ (ఎల్బీ) రషీద్ 56, కోహ్లీ , పంత్ (సి) బెయిర్స్టో (బి) జోర్డాన్ 26, శ్రేయస్ (నాటౌట్) 8, ఎక్స్ట్రాలు: 3, మొత్తం: 17.5 ఓవర్లలో 166/3. వికెట్ల పతనం: 1-0, 2-94, 3-130, బౌలింగ్: సామ్ కరన్ 4-1-22-1, ఆర్చర్ 4-0-24-0, జోర్డాన్ 2.5-0-38-1, టామ్ కరన్ 2-0-26-0, స్టోక్స్ 1-0-17-0, రషీద్ 4-0-38-1.