Tomato Price Hike | భోపాల్ : ‘మనమేమన్నా కోటీశ్వరులమనుకున్నావా.. కూరలో టమాటాలు వేస్తున్నావు.. నీలాంటి దుబారా మనిషితో నేను కాపురం చేయను పో’ అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదేమీ సినిమాలోని హాస్య సంఘటన కాదు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో అచ్చంగా జరిగిన ఘటన. దేశంలో పెరిగిన టమాట ధరలు చోరీలు, హత్యలకే కాకుండా కాపురాలను కూల్చడానికి కారణమవుతున్నదని రుజువు చేస్తున్నది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని బెమ్హోరీలో నివసించే సంజీవ్ వర్మ దాబా నడపడంతో పాటు టిఫిన్ తయారు చేసి బాక్స్లలో అందించేవాడు. భార్యకు తెలియకుండా రెండు టమాటాలు వేసి వండాడు. ఈ విషయం తెలిసిన ఆయన భార్య తీవ్ర వాగ్వాదానికి దిగింది. కిలో 200 రూపాయలకు అమ్ముతుంటే కూరలో టమాటాలు వేయడానికి నీవేమన్నా కోటీశ్వరుడివా అని నిలదీసింది. నీలాంటి వాడితో కాపురం చేయలేనంటూ కుమార్తెను తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో లబోదిబోమన్న సంజీవ్ ధన్పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను వెదికిపెట్టమంటూ వారిని అభ్యర్థించాడు.