UP Floods | ఉత్తరప్రదేశ్ల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో ఐదు జిల్లాల్లో 500కి పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వర్షాలతో లక్షల మంది ప్రజలు నష్టపోయారు. ఇక సీతాపూర్ జిల్లాలోని శారద, సరయు నదుల నుంచి పోటెత్తిన వరదతో తాంబూర్లో ఓ ఆనకట్ట తెగిపోవడంతో 40 గ్రామాలు నీట మునిగాయి.
నలుగురు వ్యక్తులు ఆ వరద నీటిలో జల సమాధి అయ్యారు. వారిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. తల్లీ కూతుళ్లతోపాటు ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు.
ఇంకా బిస్వాన్, లాహర్పూర్, మహమూదాబాద్ తహసీళ్ల పరిధిలో 120కి పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బారాబంకి జిల్లాలో మూడు తహసీళ్ల పరిధిలో 125 గ్రామాలు వరద బారిన పడ్డాయి.
వరద పోటెత్తడంతో తాంబూర్-లాల్పూర్ రోడ్డును మూసివేశారు. గోండాలో నవాబ్గంజ్ నుంచి లక్నోకు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. కర్నాల్గంజ్ వద్ద సరయు నది నుంచి 80 సెంటీమీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తున్నది.
అయోధ్యలో 41 సెం.మీ ఎత్తున ప్రమాద స్థాయిని దాటి వరద పోటెత్తుతున్నది. ఇక జార్వాల్లో ఘాఘ్రా ఎల్గిన్ వంతెన వద్ద 82 సెంమీ ఎత్తున డేంజర్ మార్క్ దాటి వరద నీరు ప్రవహిస్తోంది. లఖింపూర్ ఖేరీలోని రెండు తహసీళ్ల పరిధిలో సుమారు 200 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.