న్యూఢిల్లీ: దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్యస్త పాలన పుణ్యమాని ఇప్పుడు పాల కొరతను ఎదుర్కొంటోందన్నారు. పాల కొరత కారణంగా విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, ముఖ్యంగా డెయిరీ రైతులను అస్సలు పట్టించుకోలేదని ఆరోపించారు. దాంతో డెయిరీ రైతులు నష్టాలను ఎదుర్కొన్నారని, పాల ఉత్పత్తి తగ్గిపోయిందని ఖర్గే చెప్పారు. పాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో డిమాండ్కు సరిపడా పాలు అందుబాటులో లేక ధరలు పెరిగిపోతున్నాయని చెప్పారు.
అన్ని రంగాల్లో బీజేపీ తీరు ఇలాగే ఉన్నదని ఖర్గే విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని బీజేపీ పట్టించుకోలేదని, రైతులు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు.