న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న భారత్ బంద్కు కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా బ్యాంకింగ్, బీమా, రవాణా రంగాల సేవలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు జనవరి 9న కొన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ప్రకటించాయి. విద్యుత్తు, బ్యాంకింగ్, బీమా, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, మంచినీటి సరఫరా వంటి సేవలకు అంతరాయం కలుగవచ్చని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ బుధవారం తెలిపారు. జనవరి 27న బ్యాంకుల సమైక్య ఫ్రంట్ సమ్మె నిర్వహించడంతో రేపటి సమ్మెలో అన్ని బ్యాంకు సంఘాలు పాల్గొనకపోవచ్చునని ఆమె చెప్పారు.
అయితే ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ వంటి బ్యాంకు కార్మికుల సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆమె చెప్పారు. మైనింగ్, గ్యాస్ పైప్లైన్ రంగాలు కూడా సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని ఆమె చెప్పారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)ని కేంద్రం అనుమతించడం, కొత్త లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా బీమా రంగ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని ఆమె వెల్లడించారు. భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
అత్యవసర సర్వీసులు యథావిధిగా పనిచేసినప్పటికీ అనేక రంగాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, రాష్ట్ర రవాణా సర్వీసులు(కొన్ని రాష్ర్టాల్లో బస్సులు), ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, వస్తు తయారీ ఫ్యాక్టరీలు, బొగ్గు, ఉక్కు, ఇతర కీలక రంగాలు(స్థానిక కార్మికుల భాగస్వామ్యం మేరకు), ఎంజీనరేగా కింద గ్రామీణ ఉపాధి పనులు(నిరసన ప్రాంతాల్లో) నిలిచిపోయే అవకాశం ఉంది.
దవాఖానలు, అత్యవసర సర్వీసులు, అంబులెన్సు, అత్యవసర ఆరోగ్య సేవలు, మెట్రో సర్వీసులు(స్థానిక పాలనా సంస్థల నిర్ణయాలను బట్టి), ప్రైవేట్ కార్యాలయాలు, ఐటీ కంపెనీలు(ప్రాంతాలను బట్టి), పాఠశాలలు, కళాశాలలు(రాష్ర్టాల వారీగా నిర్ణయం మేరకు), పాలు, మెడికల్ షాపులు వంటి అత్యవసర సరఫరాలపై సమ్మె ప్రభావం ఉండదు.