న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ‘సిమ్ స్వాపింగ్ స్కామ్’లో ఓ ఢిల్లీ మహిళా న్యాయవాది రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఢిల్లీ సైబర్ పోలీసుల కథనం ప్రకారం సదరు న్యాయవాదికి ఇటీవల తెలియని నెంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆమె వేరే నెంబర్ నుంచి ఆ తెలియని నెంబర్కు కాల్ చేస్తే అవతలి వ్యక్తి కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేశానని చెప్పి ఆమె ఇంటి చిరునామా తీసుకున్నాడు. అంతే.. కొద్ది సేపటికి తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు లావాదేవీలు జరిగినట్టు ఆమెకు మేసేజ్లు వచ్చాయి. ఈ ఘటనలో ఆమె ఎలాంటి ఓటీపీ షేర్ చేయకపోవడం గమనార్హం.
ఏమిటీ మోసం..?
ఇందులో స్కామర్ మీ సిమ్ కార్డ్ యాక్సెస్ పొందుతాడు. తన వద్ద ఉన్న సిమ్ కార్డుకు మీ నెంబర్ను లింక్ చేసేలా నెట్వర్క్ ప్రొవైడర్ను మోసగిస్తాడు. ఆ తర్వాత చేయాలనుకున్న మోసాన్ని చేసేస్తాడు. ఈ నేపథ్యంలో అనుమానితులకు మీ వివరాలేవీ షేర్ చేయకూడదు. మీ సిమ్ కార్డ్ లాక్ అయితే లేదా ‘నో వ్యాలిడ్(చెల్లదు)’ అని ఎర్రర్ మేసేజ్ వస్తే వెంటనే మీ సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించి మీ నంబర్ను బ్లాక్ చేయాలి. మీ సిమ్ను లాక్ చేసే సదుపాయాన్ని వినియోగించుకోవాలి. దీని ద్వారా మీ యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ను బ్లాక్ చేసుకోవాలి. తరచూ మీ పాస్వర్డ్లను మార్చుతూ ఉండాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలను తరచూ చెక్ చేసుకోవాలి. మోసపూరిత లావాదేవీ జరిగినట్టు తెలిస్తే బ్యాంక్కు తెలియజేయాలి.