HD Kumaraswami on Rahul | కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల ఫోబియా పట్టుకుందని జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ఉనికే లేదని, ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల సైద్ధాంతిక నిబద్ధతపై వివరంగా మాట్లాడాలని సోమవారం అన్నారు. సైద్ధాంతిక నిబద్ధత లేని కారణంగా ఆరెస్సెస్, బీజేపీలపై ప్రాంతీయ పార్టీలు పోరాడలేవని, కాంగ్రెస్ మాత్రమే పోరాడుగలుగుతుందని ఆదివారం ఉదయ్పూర్లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శివిర్ చివరి రోజు ముగింపు సందర్భంగా రాహుల్గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై హెచ్డీ కుమారస్వామి స్పందించారు.
ఐకే గుజ్రాల్ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్సేనని కుమారస్వామి చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య నేపథ్యంలో ఎల్టీటీఈతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ డీఎంకేను క్యాబినెట్కు దూరంగా ఉండాలని డిమాండ్ చేసిందన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏండ్ల తరబడి డీఎంకేతో సుహృద్భావ, రాజకీయ సంబంధాలు కొనసాగించిందని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పంచుకోలేదా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్న రాహుల్ ప్రకటనపై కుమారస్వామి స్పందిస్తూ.. ప్రాంతీయ పార్టీల బలంతోనే పదేండ్లు కేంద్రంలో ఆయన పార్టీ అధికారాన్ని అనుభవించిందని గుర్తు చేశారు. కర్ణాటకలో తమ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. తర్వాత తెర వెనుక నుంచి బీజేపీతో కలిసి అనైతిక ఆపరేషన్ `లోటస్` నడపడం సైద్ధాంతిక నిబద్ధతా? సంకీర్ణ కూటమి పార్టీలను ధ్వంసం చేయడం సిద్ధాంత ప్రాతిపదిక గల రాజకీయాలా? అని ప్రశ్నించారు.
2018 ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో విడివిడిగా పోటీ చేసినా కాంగ్రెస్, జేడీఎస్ కలిసి కుమారస్వామి సారధ్యంలో సంకీర్ణ కూటమి ఏర్పాటు చేశాయి. 14 నెలల పాటు కుమారస్వామి ప్రభుత్వం పని చేసింది. కాంగ్రెస్, జేడీఎస్ల్లో అసమ్మతి వాదులు తమ పార్టీల నుంచి వైదొలిగి బీజేపీలో చేరారు. అటుపై కుమారస్వామి సర్కార్ పతనమైన సంగతి తెలిసిందే. ఒకవేళ రాహుల్గాంధీ అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు.. కర్ణాటకలో అవసాన దశలో ఉందని తెలుసుకోవాలని కుమారస్వామి అన్నారు.