బెంగళూర్ : పండగ సీజన్ ముగిసిన తర్వాత 1-5 తరగతులను తిరిగి తెరిచే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. దసరా సెలవల తర్వాత దీనిపై ఆలోచిస్తామని, తల్లితండ్రులు, నిపుణులతో సంప్రదించిన మీదట దశల వారీగా విద్యా సంస్ధలను రాష్ట్ర ప్రభుత్వం రీఓపెన్ చేసిందని, దీనిపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు.
తల్లితండ్రులు, నిపుణులతో చర్చించిన మీదట రాష్ట్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కొన్ని స్కూళ్లలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన ఉదంతాలు ఉన్నాయని, అయితే ఒకటి రెండు ఘటనల ప్రభావం 1-5 తరగతుల పునరుద్ధరణపై ఉండబోదని చెప్పారు. రాష్ట్రంలో స్కూళ్లలో వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.