బెంగళూరు, సెప్టెంబర్ 16: దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిదే ఫైల్ ముందుకు కదలదని ఎంతోకాలంగా వస్తున్న విమర్శలు అక్షర సత్యమని కెమెరా సాక్షిగా తేటతెల్లమైంది. అధికార బీజేపీ నేతలు, ప్రభుత్వ అధికారులు లంచాలు మేసి విధులను గాలికి వదిలేయటంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా నిర్మాణాలు చేయటం వల్లనే ఇటీవల బెంగళూరు మునిగిపోయిందని స్పష్టమైంది. స్వయంగా బెంగళూరు సివిల్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడే ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో కెమెరా ముందు నిజాలన్నీ కక్కేశాడు. ఇండియా టుడే విలేకరులు బీబీఎంపీ వర్కింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంజునాథ్పై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ప్రశ్న: సివిల్ కాంట్రాక్టర్లు పనులు ఎందుకు సక్రమంగా చేయటం లేదు?
జవాబు: అసలు సమస్య మున్సిపాలిటీ, ప్రభుత్వ ఇంజినీర్లతోనే. వారికి అభివృద్ధిపై ఆసక్తిలేదు. నాణ్యమైన మౌలిక వసతు ల కల్పనపై శ్రద్ధలేదు. వాళ్లు నిత్యం డబ్బులు (లంచాలు) దండుకోవటంలోనే బిజీగా ఉంటారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్మించిఉంటే వరదలు వచ్చేవి కావు. ప్రాజెక్టులపై మాకు మార్గదర్శకాలు ఇచ్చేవారేరీ? ఎలెక్టెడ్ బాడీ (నేతలు) లేదా ఇంజినీర్లు మా పనులను పర్యవేక్షించాలి. ఆ పని మీద వాళ్లెవరికీ ఆసక్తి లేదు. వాళ్ల కమీషన్ వాళ్లకు ఇచ్చేస్తే సరిపోతుంది. మా బిల్లులు మాకు వచ్చేస్తాయి. మేం మాకు తోచినట్టు పనులు చేస్తాం.
ప్రశ్న: కానీ, లంచం అనేది కొత్తదేమీ కాదు. అది ఎప్పటినుంచో ఉన్నదే కదా?
జవాబు: కానీ, ఇప్పుడు లంచం చాలా ఎక్కువగా ఉన్నది.
ప్రశ్న: గతంలో లంచంగా ఎంత ఇచ్చేవారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు?
జవాబు: గతంలో ప్రాజెక్టు బడ్జెట్లో 15-20 శాతం కమీషన్ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 40 శాతం ఇస్తున్నాం.
ప్రశ్న: మీరు కూడా ఇస్తున్నారా?
జవాబు: కమీషన్ ఇవ్వకుంటే మాకు పనే (కాంట్రాక్టులు) దొరకదు.
ప్రశ్న: ఈ కమీషన్ ఎప్పుడెప్పుడు.. ఎవరెవరికి ఇస్తారు?
జవాబు: కాంట్రాక్టు కోసం నేతలకు 12-15% ఇస్తాం. వర్క్ ఆర్డర్ కోసం మరో 2%, అసిస్టెంట్ ఇంజినీర్కు 5%, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు 3%, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు 2% ఇస్తాం.
ప్రశ్న: ఇప్పటివరకు 25% అయింది. మిగిలిన 15% లంచం ఎవరికి ఇస్తారు?
జవాబు:ఫైల్ కదలటానికి, బిల్లులకు.
ప్రశ్న: పనులు పూర్తయ్యాక వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోసమూ లంచమా?
జవాబు: అర శాతం కమీషన్ ఇస్తాం.
ప్రశ్న: పనుల తనిఖీ క్షేత్రస్థాయిలో జరుగుతుందా? ఆఫీస్లోనే చేస్తారా?
జవాబు: అంతా ఆఫీస్లోనే
ప్రశ్న: కాంట్రాక్టుల కోసం టెండర్లు ఆన్లైన్లోనే తీసుకొంటారు కదా?
జవాబు: అదంతా ఉత్తిదే. టెండర్లను మానిపులేట్ చేస్తారు.
ప్రశ్న: ఎవరు వాళ్లు?
జవాబు: ఎలెక్టెడ్ బాడీయే (ప్రభుత్వం). టెండర్ ఎవరికి ఇవ్వాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఒక పనికి సంబంధించిన టెండర్ నాకు కావాలని అనుకొన్నాను అనుకోండి.. అప్పుడు నా మిత్రులతో కలిసి టెండర్ వేస్తాను. నా బిడ్ను అనుమతించి మిగతావాళ్లవి తిరస్కరిస్తారు.
ప్రశ్న: స్థానిక ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పరా?
జవాబు: లేదు. ప్రాజెక్టు పనులకు భూమి పూజ కార్యక్రమంలో వాళ్లు ఉన్నారంటే.. అప్పటికే వాళ్లకు కమీషన్ ముట్టినట్టు లెక్క. కాంట్రాక్టుల కోసం ఆరు నుంచి 12 నెలల ముందే కమీషన్ ఇస్తాం.