బెంగళూర్ : నిఘా నేత్రాలను దాటుకుని దేశంలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ను అధికారులు రట్టు చేశారు. బెంగళూర్లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ 2.4 కోట్ల విలువైన 5 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న 18 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. కస్టమ్స్ డ్యూటీని ఎగవేసేందుకు వీరు బంగారాన్ని తమ మలద్వారంలో దాచగా కస్టమ్స్ అధికారుల సోదాల్లో పట్టుబడింది.
తమిళనాడుకు చెందిన ఈ ముఠా సభ్యులు గల్ఫ్ నుంచి రెండు విమానాల్లో బెంగళూర్కు చేరుకున్నారు. పట్టుబడిన 18 మంది ప్రయాణీకుల్లో ఒకరు దుబాయ్ నుంచి భారత్కు రాగా, మిగిలిన 17 మంది షార్జా నుంచి భారత్కు చేరుకున్నారు. సెక్యూరిటీ చెక్లో భాగంగా వీరి కదలికలపై అనుమానం రావడంతో పాటు నిఘా వర్గాల సమాచారంతో బెంగళూర్ కస్టమ్స్కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు వీరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. నిందితులపై కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.