Water Crisis | బెంగళూరులో నీటి కష్టాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నీటి సంక్షోభం కారణంగా తాగునీటిని కూడా సరఫరా చేయలేక వాటర్ బోర్డు చేతులెత్తేస్తోంది. దీంతో రెండు వారాలుగా బెంగళూరు వాసులు విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఉందని ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ క్రమంలోనే హోలీ వేడుకలపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్లను నిషేధించింది. బోర్వెల్ నీటిని కూడా హోలీ వేడుకలకు వాడుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బెంగళూరులో రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీటి వినియోగం జరుగుతోంది. కానీ రోజుకు 2వేల మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతుంది. దీంతో రోజుకు ఆరు నుంచి 7 వందల లీటర్ల నీటి కొరత వస్తుంది. దీంతో నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే హోలీ వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువుల పండుగపై ఆంక్షలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్కు నీటి కష్టాలు
బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్లకు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. ఐపీఎల్ షెడ్యూల్లో భాగంగా మార్చి 25, మార్చి 29, ఏప్రిల్ 2న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో రోజుకు 75 వేల లీటర్ల నీళ్లు స్టేడియానికి అవసరమని కర్ణాటక క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే నీటి కొరత కారణంగా స్టేడియాన్ని తడిపేందుకు శుద్ధి చేసిన మురికి నీటిని వాడాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియాన్ని తడిపేందుకు మురికి నీటిని వాడాలన్న నిర్ణయంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.