Bengaluru cafe blast | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తాజాగా స్పందించారు. బస్సులో రామేశ్వరం కేఫ్కు వచ్చిన ఓ వ్యక్తి ఈ పేలుడుకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
శనివారం ఉదయం మైసూర్లో మీడియాతో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్కు వచ్చినట్లు చెప్పారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడని.. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్లోని బాంబుకు టైమర్ సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. అతడు ఎవరో తెలీలేదని, సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామన్నారు. పేలుడులో గాయపడి వారు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పారు. నిన్న డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్ ఘటనాస్థలిని పరిశీలించినట్లు చెప్పారు. ఇవాళ తాను కూడా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు చెప్పారు. అదే విధంగా పేలుడు ఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని సిద్ధరామయ్య మండిపడ్డారు. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? అని ప్రశ్నించారు. దీనిపై రాజకీయం చేయకూడదని వ్యాఖ్యానించారు. పేలుడు ఘటనపై సీరియస్గా దర్యాప్తు జరుగుతోందన్నారు. దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
Also Read..
Delhi Police | బెంగళూరు కేఫ్లో బాంబ్ బ్లాస్ట్.. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్
Joe Biden | గాజాలో మానవతాసాయానికి ముందుకొచ్చిన అమెరికా.. మిలటరీ విమానాల ద్వారా ఫుడ్ సప్లై