బెంగళూర్ : బిర్యానీ తర్వాత జనాలు అధికంగా ఇష్టపడేది కేక్స్ అంటే అతిశయోక్తి కాదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీపై (Swiggy) ఈ ఏడాది బెంగళూర్ వాసులు ఏకంగా 85 లక్షల కేకులు ఆర్డర్ చేయడంతో ఈ నగరం కేక్ క్యాపిటల్ టైటిల్ను దక్కించుకుంది. హౌ ఇండియా స్విగ్గీడ్ ఇన్ 2023 వార్షిక నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. చాక్లెట్ ఫ్లేవర్తో కూడిన కేక్లను బెంగళూర్ వాసులు ఇష్టంగా ఆరగించారు. బెంగళూర్ను కేక్ క్యాపిటల్గా గౌరవించామని, 2023లో నగరవాసులు పెద్దసంఖ్యలో కేకులను ఆర్డర్ చేశారని స్విగ్గీ వెబ్సైట్లోని బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.
ఈ ఏడాది వాలెంటైన్స్ డే నాడు ఇండియా నిమిషానికి 271 కేక్లను ఆర్డర్ చేసిందని పోస్ట్ తెలిపింది. ఇక ఈ ఏడాది స్విగ్గీలో అత్యధిక మంది ఆర్డర్ చేసిన ఫుడ్గా బిర్యానీ ముందువరసలో నిలిచింది.ఇక ముంబై వాసి 2023లో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ను ఆర్డర్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బిర్యానీతో పాటు కేక్స్, గులాబ్ జామ్, పిజ్జాలనూ కస్టమర్లు అధికంగా ఆర్డర్ చేశారు.
ఏడాది పొడవునా సెకన్కు 2.5 సర్వింగ్స్ రేటుతో బిర్యానీని ఆర్డర్ చేశారని ఈ నివేదిక తెలిపింది. గత ఎనిమిదేండ్లుగా బిర్యానీనే అత్యధికులు ఆర్డర్ చేసిన డిష్గా చార్ట్లో టాప్గా నిలుస్తోంది.చికెన్ బిర్యానీకి అత్యధికులు మొగ్గుచూపగా శాకాహారులు సైతం వెజ్ బిర్యానీని ఆర్డర్ చేయడం పట్ల ఆసక్తి కనబరిచారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బిర్యానీ క్రేజ్ ఓ రేంజ్లో నెలకొంది. ఆ రోజు చండీఘఢ్కు చెందిన ఓ కుటుంబం ఏకంగా 70 ప్లేట్లు ఆర్డర్ చేసిందని స్విగ్గీ రిపోర్ట్ పేర్కొంది.
Read More :
Google Search 2023: ఈ ఏడాది ‘భారత్’ గురించి ప్రపంచం ‘సెర్చ్’ చేసిందేంటి..?