వరుసగా పార్టీని వీడుతున్న నేతలు
కోల్కతా, ఏప్రిల్ 19: పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో బీజేపీలో అసమ్మతి పెరుగుతున్నది. పార్టీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. 24 గంటల్లోనే 14 మంది జిల్లా స్థాయి కీలక నేతలు రాజీనామా చేశారు. అసమర్థ నేతలకు పార్టీలో కీలక పదవులు కట్టబెడుతూ నిజాయతీగా పార్టీ కోసం పనిచేసే వారిని పట్టించుకోవట్లేదని వారు మండిపడ్డారు.
ఇప్పటికే ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. తాజాగా అదే జిల్లాకు చెందిన స్టేట్ కమిటీ సభ్యుడు బని గంగోపాధ్యాయ రాజీనామా చేశారు. నదియా జిల్లాకు చెందిన 10 మంది నేతలు మూకుమ్మడిగా రాజీనామా పత్రాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్కు పంపారు. జిల్లా నేతలు వారికి కావాల్సిన వారినే అందలం ఎక్కిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమని లేఖలో రాశారు.