న్యూఢిల్లీ, జనవరి 28: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించడంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జర్మనీ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను హరించొద్దని పేర్కొన్నది. మీడియా, భావప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమైనవని, వాటిని సమర్థించాలని పేర్కొన్నది. బీబీసీ లఘుచిత్రంపై నెలకొన్న వివాదంపై శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను పొందుపరిచారు. వీటిల్లో మీడియా, భావప్రకటనా స్వేచ్ఛ కూడా ఉన్నాయి. ఈ విలువైన అంశాలను భారత్తో జర్మనీ నిరంతరంగా పంచుకొంటూ చర్చిస్తున్నది’ అని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రిన్స్ కూడా బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై మాట్లాడారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన విషయం. భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యతను హైలెట్ చేయడానికి ఇది సరైన సమయం’ అని పేర్కొన్నారు.