(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఐదు గ్యారెంటీల ప్రచారంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటి అమలు తలకుమించిన భారంగా మారిపోయింది. పథకాల అమలుకు ఏటా రూ. 58 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి రావడం, నిజమైన లబ్ధిదారులకు గ్యారెంటీలు సక్రమంగా చేరకపోవడంతో పలు ప్రాంతాల్లో నిరసనలు పెరుగుతుండటం వెరసి అధికారపార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారు.
ఈ క్రమంలో ఐదు గ్యారెంటీల అమలు సర్కారుకు గుదిబండగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలను కొనసాగించాలంటే ఏటా రూ. 58 వేల కోట్లు అవసరం. ఇది ఖజానాపై పెను భారమే. అందుకే, దీనిపై ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నాం. ఒకవైపు గ్యారెంటీలను అమలు చేస్తూనే, వ్యయాన్ని తగ్గించుకోడానికి స్కీమ్ నిబంధనల్లో ఏమేం మార్పులు చేర్పులు తీసుకురావొచ్చో చర్చిస్తున్నాం. గ్యారెంటీలను అమలు చేయడానికి కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం నుంచి రాబట్టేందుకు ఒక ఆర్థిక సలహాదారుగా అవసరమైన కార్యాచరణను రూపొందిస్తున్నా’ అని రాయరెడ్డి అన్నారు. ఈ మేరకు ఇంగ్లిష్ న్యూస్ చానల్ రిపబ్లిక్ టీవీతో మాట్లాడారు.
కుంటుపడనున్న అభివృద్ధి
ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలను అమలు చేయడానికి నిధులను ఖర్చు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులు పడకేయడం ఖాయమన్న ఆందోళనను కూడా రాయరెడ్డి వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని గతంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరో మంత్రి శరనబసప్పా దర్శనపూర్ కూడా వ్యక్తం చేయడం గమనార్హం. సిద్ధరామయ్య సర్కారు తీసుకొచ్చిన 5 గ్యారెంటీలను అమలు చేయాలంటే ఖజానాపై రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ భారం పడుతుందని, అందుకే తొలి ఏడాది ఇన్ఫ్రా ప్రాజెక్టులు ప్రారంభించకపోవచ్చని గత జూన్లో శరనబసప్పా అన్నారు. 5 గ్యారెంటీల కారణంగా నియోజకవర్గాల్లో తొలిఏడాది అభివృద్ధి పనులు జరుగకపోవచ్చని గత జూలైలో డీకే ఎమ్మెల్యేల సమావేశంలో పేర్కొన్నారు.