Supriya Sule | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియాసూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ను రాజకీయంగా అంతమొందించడానికే బారామతిలో ‘కుటుంబ పోరు’ జరిగేలా బీజేపీ కుట్ర పన్నిందని సుప్రియా సూలే ఆరోపించారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచి మరోమారు ఆమె పోటీ చేయనున్నది. సుప్రియా సూలేకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సునేత్ర పవార్ తనకు తల్లితో సమానం అని సుప్రియా సూలే చెప్పారు. ప్రస్తుత పరిణామాలు ఆమె పట్ల తనకు ఉన్న గౌరవం తగ్గదని చెప్పారు.
‘మహారాష్ట్రకు వ్యతిరేకంగా, పవార్ కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ ఈ కుట్ర చేస్తున్నది. డెవలప్మెంట్ కోసం సునేత్ర పవార్ను పోటీలోకి దించడం లేదు. ఇది రాజకీయంగా శరద్ పవార్ను అంతం చేయడానికే. ఆ పార్టీ సీనియర్ సీనియర్ నేత కూడా ఇదే మాట చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీకి బలమైన అభ్యర్థుల్లేకే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. మరాఠీ ప్రజల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నది. సిద్ధాంత పరంగా జరిగే మా పోరును వ్యక్తిగతం చేసింది’ అని బీజేపీపై సుప్రియా సూలే మండి పడ్డారు.
తొలిసారి 2009 ఎన్నికల్లో సుప్రియా సూలే ఎన్నికైనప్పటి నుంచి బారామతి స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం శరద్ పవార్ కుటుంబానికి పట్టు ఉన్న నియోజకవర్గం. 1991 నుంచి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి అజిత్ పవార్ అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. ఇప్పటి వరకూ సోదరి సుప్రియా సూలేకు మద్దతుగా ప్రచారం చేసిన అజిత్ పవార్.. ఈ దఫా ఆమెపై తన సతీమణి సునేత్ర పవార్’ను నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ సైతం తన కూతురు కోసం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.