Bank Employees | ముంబై, డిసెంబర్ 4: ఐదు రోజుల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో నిరసనలకు దిగాలని భావిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజులే పని ఉండేలా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం జరిగింది.
ఇందుకు గానూ ప్రతిరోజూ బ్యాంకు ఉద్యోగులు 40 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది. 2015 నుంచి బ్యాంకు ఉద్యోగులు ఈ విధానం కోసం డిమాండ్ చేస్తున్నారు.దీంతో త్వరలోనే పోరాటం ప్రారంభించాలని భావిస్తున్నామని, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాయ్ పేర్కొన్నారు.