Himanta Biswa Sarma : బంగ్లాదేశ్ అంశంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్పందించింది. హిమంత శర్మ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్లోని భారత ప్రధాన రాయబారి పవన్ బాధేకు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేసింది. హిమంత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకమరమని, ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాల్ని దెబ్బతీస్తాయని బంగ్లా పేర్కొంది.
ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ నోటీసుల్లో పేర్కొంది. గత ఏప్రిల్లో హిమంత శర్మ ఒక మీడియా సంస్తతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియా–బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలపై మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా బాలేని సంగతి తెలిసిందే. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరిస్తితిలో కాస్త మార్పు వచ్చింది. మళ్లీ ఇండియా–బంగ్లా మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. దౌత్య కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఇదే అంశంపై హిమంతను మీడియా సంస్థ ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుపడకపోవడమే అసోంకు మంచిదని వ్యాఖ్యానించారు.
‘‘యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఉన్నప్పుడు ఇండియా–బంగ్లా మధ్య సంబంధాలు ఎలా ఉండేవో ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటాను. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వకూడదని ప్రతి రోజూ ఉదయం దేవుడిని కోరుకుంటా. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగోలేకపోవడమే మాకు మంచిది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే, అసోంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులు వారి దేశానికి పంపించడం సాధ్యపడకపోవచ్చు. దీనివల్ల అసోంకు నష్టం. అందుకే అసోం ప్రజలు కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు బావుండకూడదని కోరుకుంటారు.
ఇండియా, బంగ్లాదేశ్ మధ్య స్నేహం కుదిరి, బీఎస్ఎఫ్ జవాన్లు, బంగ్లాకు చెందిన బీజీబీ సైనికులు కరచాలనం చేసుకుంటే అది అసోంకు మాత్రం ప్రమాదకరం” అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపైనే బంగ్లాదేశ్ అభ్యంతరం తెలుపుతూ తాజాగా భారత రాయబారికి నోటీసులు జారీ చేసింది.