Bangalore | హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఈ మేరకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారా? ఇందులో నిజమెంతా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ వార్తలకు ఊతమిచ్చాయి. ఈ క్రమంలోనే ఫాక్స్కాన్ లేఖపై డీకేను ఎన్డీటీవీ సహా పలు జాతీయ మీడియా సంస్థలు ప్రశ్నించాయి. ‘లేఖ రాశారా?’ అని అడిగాయి. అయితే, ఆ లెటర్ను నకిలీగా అభివర్ణించిన ఆయన.. ఏ కంపెనీకి లేఖ రాయలేదని చెప్పుకొచ్చారు. దీంతో ‘బెంగళూరుకు కంపెనీలు వద్దా?’ అంటూ మీడియా ఎదురు ప్రశ్నించింది. అనుకోని ప్రశ్నతో ఒకింత షాక్కు గురైన డీకే.. మాటమార్చుతూ రాజకీయాలపైకి విషయాన్ని మళ్లించారు. ఎందుకు??
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘బెంగళూరుకు కంపెనీలు వద్దా?’ అని మీడియా ప్రశ్నించగానే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాటమార్చడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. బెంగళూరులో మౌలికవసతుల కొరత కారణంగానే కొత్త కంపెనీలు రావట్లేదని, ఇది తెలిసే, డీకే మాటమార్చారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. గడిచిన ఐదేండ్లుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమేననిపిస్తున్నది.
నిన్నటివరకూ బహుళజాతి సంస్థలకు, కొత్త పెట్టుబడులకు బెంగళూరే గమ్యస్థానంగా ఉండేది. అయితే, నాలుగేండ్ల బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో సిలికాన్ సిటీ సమస్యలకు అడ్డాగా మారిపోయింది. రోడ్డెక్కితే ట్రాఫిక్ కష్టాలు, విద్యుత్తు కోతలు, తాగునీటికి తంటాలు, మౌలిక వసతుల లేమి, లోపభూయిష్టమైన పాలసీలు, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి వెరసి బెంగళూరులో కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు ఎవ్వరూ మొగ్గుచూపట్లేదు.
ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు
బెంగళూరులో గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. ఇటీవల జరిగిన మూడు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. బెంగళూరు ట్రాఫిక్లో వంట కూడా చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
కారులో ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై గంటల తరబడి ట్రాఫిక్ జావ్ులో చిక్కుకున్న కొందరు పిజ్జాకు ఆర్డర్ ఇవ్వడం, దానిని ఆన్టైవ్ులోనే డెలివరీ బాయ్ ట్రాఫిక్లో ఇరుక్కుని ఉన్న కారు వద్దకే వచ్చి డెలివరీ చేసిన వీడియో వైరల్గా మారింది. ఇక, బెంగళూరు ట్రాఫిక్లో చిక్కుకొన్న ఓ వ్యక్తికి అతనేదో షాపింగ్కు వెళ్లినట్టు ‘మీ షాపింగ్ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్మాల్ పక్కన ట్రాఫిక్లో చిక్కుకుపోవడమే అందుకు కారణంగా తెలుస్తున్నది.
గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నట్టు మండిపడుతున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్ దాస్, ఖాతా బుక్ సంస్థ వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్, దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ కమెడియన్ ట్రెవోర్ నోహ్ సహా పలువురు ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
అటు విద్యుత్తు కోతలు.. ఇటు నీటి వెతలు
బెంగళూరులో గంటలతరబడి కొనసాగుతున్న విద్యుత్తు కోతలతో అటు ప్రజలతో పాటు పారిశ్రామికవర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తరుచూ పవర్కట్స్ కొనసాగుతుండటంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా (వర్క్ ఫ్రమ్ హోమ్) ఆదేశిస్తున్నాయి. శివారుల్లోని చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు, కర్మాగారాలు పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చాక విద్యుత్తు కష్టాలు మరింతగా పెరిగాయని పలువురు మండిపడుతున్నారు.
అయితే, మరమ్మతుల పనుల కారణంగానే విద్యుత్తు కోతలు విధిస్తున్నట్టు ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు, నగరంలోని స్మార్ట్సిటీ, ఎలక్ట్రానిక్సిటీ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నీటి సరఫరాపై సర్కారుకు సరైన ప్రణాళిక లోపించడం, కావేరీ ప్రాజెక్టు-5 పనుల్లో జాప్యంతో సిటీతో పాటు శివారుల్లోని దాదాపు 110 మేజర్ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నది. అయితే, నైపుణ్యం కలిగిన కార్మికులు దొరకకపోవడంతోనే కావేరీ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నట్టు కాంగ్రెస్ సర్కారు వింత కారణం చెబుతుండటం విమర్శలకు తావిస్తున్నది.
వీటితో మరింత సతమతం
ట్రాఫిక్, విద్యుత్తు, నీటి కష్టాలే కాదు కంపెనీలను ప్రారంభించడానికి అవసరమైన మౌలికవసతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. కంపెనీలకు అనుమతులను మంజూరు చేసే పారిశ్రామిక విధానాలు ఒక దశ-దిశలేకుండా లోపభూయిష్టంగా ఉండటం, సర్కారులో పేరుకుపోయిన తీవ్రమైన అవినీతి పెట్టుబడులకు ఆటంకంగా మారాయి. దీంతో నైపుణ్యం కలిగిన మానవవనరులు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ బెంగళూరుకు కొత్త పరిశ్రమలు రావడంలేదు.
ఇదే సమయంలో పరిశ్రమలకు అత్యంత అనుకూల వాతావరణాన్ని కలిగిఉన్న హైదరాబాద్ వైపునకు పారిశ్రామికవేత్తలు దృష్టిసారిస్తున్నారు. దీంతో ఉన్నపళంగా మౌలిక వసతులను మెరుగుపర్చలేక, నగరాన్ని విడిచిపోతున్న పరిశ్రమలను అడ్డుకోలేక కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతున్నది. కుట్రలతో హైదరాబాద్ నుంచి కంపెనీలను రప్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
పెట్టుబడులు కష్టం
కర్ణాటకలో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్య ఉన్నది. పరిస్థితులు మారకపోతే, నగరానికి పెట్టుబడులు రావడం కష్టం.
– బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా
అందుకే తరలిపోతున్నాయి
కర్ణాటకలో సమస్యలు ఉండటంవల్లే పెట్టుబడులు హైదరాబాద్కు తరలిపోతున్నాయి.
– ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్ దాస్
తిప్పలు తప్పట్లే
కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా బెంగళూరులోని స్టార్టప్ కంపెనీలకు తిప్పలు తప్పడం లేదు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ఖ్యాతిపొందిన బెంగళూరులో ఇప్పుడు ఎటు చూసినా విద్యుత్తు కోతలు, గతుకుల రోడ్లు, నడిచేందుకు ఏమాత్రం వీలుకాని ఫుట్పాత్లు, అస్తవ్యస్థమైన నీటి సరఫరా వ్యవస్థలే.
– ఖాతా బుక్ సంస్థ వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్