డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది శుక్రవారం తెలిపారు. దర్యాప్తులో ఎవరైనా సిబ్బంది దోషులుగా తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు కోరినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సదరు ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని తెలిపారు. అయోధ్య ఆలయంలో కానుకల చోరీ దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే బద్రీనాథ్ ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.