భువనేశ్వర్: ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న డీజిల్ను ఏడాదిన్నర వయసున్న బాబు తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. మంగళవారం ఒక వ్యక్తి తన వాహనాన్ని రిపేర్ చేశాడు. ఈ సందర్భంగా అందులోని డీజిల్ తీసి ఒక బాటిల్లో ఉంచాడు. అయితే ఇంట్లో ఆడుకుంటున్న ఆ వ్యక్తి కుమారుడైన ఏడాదిన్నర వయసున్న పసి బాలుడు పొరపాటున ఆ బాటిల్లోని డీజిల్ను తాగాడు. అనంతరం ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
గమనించిన తల్లిదండ్రులు ఆ బాబును తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి పరిస్థితి సీరియస్గా ఉండటంతో భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. అయితే అక్కడ కూడా బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ పసి బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో వైద్యులు విచారం వ్యక్తం చేశారు.