న్యూఢిల్లీ: అలోపతి వైద్యం వల్ల లక్షల మంది చనిపోయినట్లు ఇటీవల యోగా గురు బాబా రామ్దేవ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో బాబా రామ్దేవ్పై పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల పట్ల స్టే ఇవ్వాలని ఇవాళ రామ్దేవ్ సుప్రీంను ఆశ్రయించారు. అలోపతిపై యోగా గురు రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్లు బ్లాక్ డే పాటించిన విషయం తెలిసిందే. ఆధునిక వైద్య చికిత్సలు తెలివి లేనివని, అలోపతి లక్షల మందిని చంపేసిందని రామ్దేవ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివిధ మెడికల్ అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేశాయి. రామ్దేవ్ నుంచి బేషరతు క్షమాపణలు డిమాండ్ చేశాయి. కరోనా మహమ్మారి కంటే ఆధునిక వైద్యం వల్లే ఎక్కువ మంది చనిపోయారని రామ్దేవ్ అనడం తీవ్ర ఆక్షేపణీయం అని ఈ అసోసియేషన్లు మండిపడ్డాయి.