న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో రాష్ర్టానికి కొత్త సీఎం ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ లాంటి మరో ఆధ్యాత్మిక వేత్త రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించవచ్చునని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
రాజస్థాన్ యోగిగా పేరొందిన ఆల్వార్ ఎంపీ బాబా బాలక్నాథ్ పేరు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నది. బీజేపీలో సీనియర్ నేతలుగా ఉన్న మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. బాబా బాలక్నాథ్ తిజారా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్ సీఎంగా బరిలో ఉంటారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బీజేపీకి ప్రాణాధారమైన మోదీ కింద పనిచేయడానికి తాను ఇష్టపడతానని, సీఎం ఎవరు అన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని బాలక్నాథ్ అన్నారు.
రెండుసార్లు సీఎంగా చేసిన వసుంధరా రాజే
బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న వసుంధరా రాజే గతంలో రెండుసార్లు రాష్ర్టానికి సీఎంగా పనిచేశారు. అయితే ఆమెను మూడోసారి సీఎం చేసేందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గజేంద్ర సింగ్ షెకావత్ ప్రస్తుత సీఎం గెహ్లాట్ ప్రాతినిధ్యం వహిస్తున్న జోధ్పూర్కు చెందినవారు. దీంతో ఆయన కూడా బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఇక ఎంపీ దియా కుమారి పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తున్నది. రాజ్పుత్ వర్గానికి చెందిన ఈమె తన నియోజకవర్గం సవాయ్ మాధోపుర్లో చేసిన అభివృద్ధి కారణంగా విశేష ప్రజాదరణ పొందారు. వసుంధరకు ఈమె ప్రత్యామ్నాయం కాగలరని భావిస్తున్నారు.