లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.25,000 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అయోధ్య నగరం పునరుద్ధరణ, కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రోడ్డు కనెక్టివిటీ, టౌన్షిప్ డెవలప్మెంట్ కోసం సుమారు రూ.85,000 కోట్లు(సుమారు 10 బిలియన్ డాలర్లు ) ప్రభుత్వం ఖర్చు చేసినట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది. అయోధ్యను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ ద్వారా ప్రస్తుతం సామర్థ్యం ఏడాదికి పది లక్షల ప్రయాణికుల నుంచి దశల వారీగా విస్తరణ ద్వారా 2025 నాటికి 60 లక్షల సామర్థ్యానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రైలులో అయోధ్యకు చేరే వారి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 60,000 వేలకు పెరుగుతుందని భావిస్తున్నారు.
కాగా, అయోధ్యలో ప్రస్తుతం 590 గదులతో కూడిన 17 హోటల్స్ ఉన్నాయి. కొత్తగా 73 హోటల్స్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. సుమారు 40 హోటళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రసిద్ధ ఇండియన్ హోటల్స్, మారియట్, విండ్హామ్ హోటళ్ల కోసం ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. ఐటీసీ కూడా అయోధ్యలో హోటల్ నిర్మాణంపై కసరత్తు చేస్తోంది. అయోధ్యలో హోటల్ గదులను వెయ్యికి అనుసంధానం చేయాలని ఓయో యోచిస్తోంది.
మరోవైపు భారీ అభివృద్ధి వల్ల ఉత్తరప్రదేశ్తోపాటు అయోధ్యకు పర్యాటకుల తాకిడి భారీగా పెరుగుతుందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లోని పర్యాటకుల మొత్తం ఖర్చు ఏడాదికి రూ.4 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.25,000 కోట్ల ఆదాయం లభిస్తుందని బిజినెస్ ఏజెన్సీలు అంచనా వేశాయి.