2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం.. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం.. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం… ఇవన్నీ అయోధ్యలోని భవ్య రామ మందిర వైభవాన్ని చాటిచెప్పే విశిష్టతలు. వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం, విశేషాలపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి నెలకొన్నది. ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకొంటున్న జగదానంద కారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే.. నయనానందం పొందాల్సిందే!
-స్పెషల్ టాస్క్ బ్యూరో
Ayodhya Ram Mandir | నమస్తే తెలంగాణ, డిసెంబర్ 30: జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ర్టాల కళాకారులు, కార్మికులు పాలుపంచుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ఆలయానికి, శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి.
ప్రస్తుత రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకున్నది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోమ్పుర కుటుంబీకులు ఈ డిజైన్ను అందించారు. అప్పటి వీహెచ్పీ అధిపతి అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు, ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకొన్నారు. కానీ, అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం డిజైన్ రూపొందించారు.
ప్రధాన ఆలయాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించగా, ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2,500 ఏండ్లపాటు ఆలయం వాటిని తట్టుకొనేలా డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశీశ్ సోంపురా తెలిపారు.
ఆయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2,587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం (బాబూ లాల్ టైలర్స్)ను నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడీ, శంకర్ లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్యవస్ర్తాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్ర్తాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబూలాల్కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్ర్తాలు సమకూరుస్తున్నది.
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్య కిరణాలు పడినట్లుగానే, రామమందిరంలోని బాల రాముడి విగ్రహంమీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తున్నది.
గర్భగుడిలో ప్రతిష్ఠించే బాల రాముడి ఎత్తు 51 అంగుళాలు. ఐదేండ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది.
ప్రపంచంలో మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకొన్నది. ప్రస్తుతం అంకోర్వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది. తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది.
మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు.
అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ను సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే.
శంకుస్థాపన: 5.08.2020
ప్రాణ ప్రతిష్ఠ: 22.01.2024
మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా): 2026
ప్రధాన ఆలయం విస్తీర్ణం: 2.77 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు
ఆలయం పొడవు: 360 అడుగులు
ఆలయం వెడల్పు: 235 అడుగులు
ఆలయ శిఖరం ఎత్తు: 161 అడుగులు
ప్రవేశ ద్వారాలు: 12
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు: 51 అంగుళాలు
భక్తులకు దర్శనం ఇచ్చే దూరం: 35 అడుగులు
రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం: 110 ఎకరాలు
ఏకకాలంలో ఎంతమంది కాంప్లెక్స్లో ఉండొచ్చు: 10 లక్షల మంది వరకు
రామ మందిరానికి అయిన ఖర్చు: 400 కోట్లు
కాంప్లెక్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా): 1,800 కోట్లు
జూన్, 2022 నాటికి ట్రస్ట్కు వచ్చిన విరాళాలు: 3,400 కోట్లు