అయోధ్య: అయోధ్యలో కొలువైన బాలక్ రామ్కు రోజూ మధ్యాహ్నం ఓ గంట సేపు విశ్రాంతి ఇవ్వనున్నట్లు ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. ఈ సమయంలో దేవాలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. బాల రాముని వయసు ఐదేళ్లు అని, ఆయన ఎక్కువసేపు మేలుకుని ఉంటూ, ఒత్తిడిని భరించలేడని చెప్పారు. ఆయనకు విశ్రాంతి ఇవ్వడం కోసం శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి ఇవ్వాలని దేవాలయం ట్రస్ట్ నిర్ణయించిందన్నారు.
బాలక్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు దర్శనానికి అనుమతించేవారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాతి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో దర్శనం వేళలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. బాలక్రామ్కు తెల్లవారు జామున 4 గంటల నుంచి రెండు గంటల సేపు హారతి, అర్చన నిర్వహిస్తున్నారు.