అయోధ్య: అయోధ్య (Ayodhya) బాలరాముని దర్శనానికి భక్త జన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతిరోజూ లక్ష మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. ఆలయంలో రామయ్య కొలువుదీరి (Ram Temple) నేటికి 11 రోజులు అవుతున్నది. గత నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలక్రాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా భక్తులు బాలుని రూపంలో ఉన్న శ్రీరాముడిని చూసి తరించారు. అదేవిధంగా విరాళాల రూపంలో రూ.11 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఇందులో హుండీ ఆదాయం రూ.8 కోట్లు ఉండగా, చెక్కులు, ఆన్లైన్ పేమెంట్ రూపంలో మరో రూ.3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్టు అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.
రామ్లాల్ల దర్శనానికి వస్తున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయంలో నాలుగు హుండీలతోపాటు డిజిటల్ రూపంలో వచ్చే విరాళాల కోసం 10 కంప్యూటర్ ఆధారిత కౌంటర్లను ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఆలయ వేళలు ముగిసిన తర్వాత హుండీలలో నగదును లెక్కిస్తారు. దీనికోసం 14 మందిని ఆయల కమిటీ నియమించింది. వారిలో 11 మంది బ్యాంకు ఉద్యోగులు ఉండగా, మరో ముగ్గురు ఆలయానికి చెందినవారు ఉన్నారని ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.