PM Modi | హైదరాబాద్, డిసెంబర్ 18 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
2022 గణాంకాల ప్రకారం రోజుకు 154 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాత్రం మోదీ హయంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ఒక్కసారి కూడా పార్లమెంటులో చర్చించలేదని, అంటే రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదంటూ వాదించడం గమనార్హం.
పెరిగిన రైతుల ఆత్మహత్యలు
ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 శాతం పెరిగాయి. 2021లో 1,64,033 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2022లో ఆ సంఖ్య 1,70,924కు పెరిగింది. గత అయిదేండ్లలో అన్నదాతల బలవన్మరణాలు 27 శాతం పెరిగాయి. 2019 తో పోల్చితే 2020లో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు 18 శాతం పెరిగాయి.
గిట్టుబాటు ధర లేక పోవడమే
నేడు వ్యవసాయంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, అందుకు తగ్గట్టుగా పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతులు రుణగ్రస్తులుగా మిగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా యోజన అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా ఉన్నది. రైతులకు నష్టపరిహారం అందించే బదులు, అది బీమా కంపెనీలకు లాభదాయకంగా మారింది.
తెలంగాణలో తగ్గిన రైతు ఆత్మహత్యలు
ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే తెలంగాణ ప్రాంతంలో, ప్రత్యేక రాష్ట్రమేర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు, ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల రైతు బంధు ఆర్థిక సహాయం వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి. 2018 ఎన్సీఆర్బీ గణాంకాలతో పోలిస్తే 2019లో తెలంగాణలో 45 శాతం అన్నదాతల ఆత్మహత్యలు తగ్గిపోయాయి.
2022లో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాలు
రాష్ట్రం : ఆత్మహత్యలు
మహారాష్ట్ర : 2,640
కర్ణాటక : 1,170
ఆంధ్రప్రదేశ్ : 481