న్యూఢిల్లీ : కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఎల్టీ, జేఎం, ఇతర రాడికల్ గ్రూపుల నుంచి ముప్పు పెంచి ఉందని ఐబీ పది పేజీల నివేదికలో పేర్కొంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద నిబంధనలు కఠినతరం చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నివేదికలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన దాడిని సైతం ఐబీ ప్రస్తావిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఐబీ ఆదేశించింది.
అలాగే ఉదయ్పూర్, అమరావతిలో ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ, రద్దీ ప్రదేశాలలో రాడికల్ గ్రూప్ల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని ఐబీ ఆదేశించింది. ఉగ్రవాద సంస్థలు యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్), పారాగ్లైడర్లను సైతం వినియోగించొచ్చని ఐబీ పేర్కొంది. జమ్మూ కశ్మీర్లోనూ దాడులు జరిగే అవకాశాలున్నాయి, బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని రోహింగ్యాలు, ఆఫ్ఘనిస్తాన్, సూడన్ వాసులు నివసిస్తున్న ప్రాంతాలను పర్యవేక్షిస్తూ.. నిఘా వేయాలని సూచించింది. దీంతో పాటు టిఫిన్ బాంబు, స్టిక్కీ బాంబ్, వీవీఈడీలను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఐబీ.. పోలీసులను ఆదేశించింది.